విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని రంగారెడ్డి – 3 డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్ పెక్టర్ టి.సూర్య చంద్ర శేఖర్ అన్నారు. ఈ రోజు సి బి ఐ టి కళాశాల జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు సందర్బంగా జరుగుతున్న కార్యక్రమంలో ముఖ్య అతిధి గా విచ్చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
కేంద్ర విద్యుత్ అథారిటీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు ప్రతి ఏడాది జూన్ 26 నుంచి జులై 2 వరకూ జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు పాటిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్ భద్రత పాటించాలన్నారు. భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వినియోగదారులు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవడానికి వీలుగా విద్యుత్ పరికరాల నిర్వహణకు సంబంధించి చేయవలసినవి, చేయకూడని విషయాలను వివరించారు.
విద్యుత్ పరికరాలను సురక్షితంగా నిర్వహించడంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నందున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు ముఖ్యంగా వర్షాకాలం లో కరెంటు సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ తీగలకు, విద్యుత్ పోల్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సిబిఐటి కళాశాల జూన్ 26 నుంచి జులై 2 వరకూ జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ విభాగ సీనియర్ ప్రొఫెసర్ జి సురేష్ బాబు, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.