ఇటీవల ఘాట్రోడ్లపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వాటి నివారణకు, శ్రీవారి ఆశీస్సులు కోరుతూ, వైఖానస ఆగమంలో పేర్కొనబడిన ఈ విశిష్ట మహా శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం డౌన్ఘాట్ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన మహా శాంతి హోమంలో ఈవో పాల్గొన్నారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఘాట్రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా, మరికొన్ని ప్రమాదాలు జరిగాయన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
అదే సమయంలో, భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారన్నారు. “భవిష్యత్తులో ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రోజు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహా శాంతి హోమం నిర్వహించిన్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు
కలిగినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రంలో మహాశాంతి హోమం నిర్వహించడం గురించి పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వారు వివరించారు.
ఉదయం 8 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది. హోమం విశిష్టతను వివరించారు.
శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో లోకనాథం, ఋత్వికులు సీతారామాచార్యులు, అర్చక సాయి స్వామి, పారుపత్తేదార్ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.