ప్రపంచమంతా ప్రభుత్వాలు వైద్యులకు సన్మానాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ ప్రభుత్వ మాత్రం డాక్టర్లకు పిచ్చి వాళ్లనే ముద్ర వేస్తున్నదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ‘‘మాస్కులు ఇవ్వండి మహాప్రభో అన్న డాక్టర్కి పిచ్చా?..సమాధానం చెప్పండి సాయిరెడ్డి.
ప్రపంచమంతా వైద్యులకు సన్మానాలు చేస్తుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం డాక్టర్లపై పిచ్చివాళ్లు అనే ముద్ర వేస్తుంది. జగన్రెడ్డి, విజయసాయిరెడ్డిలకు పిచ్చిపట్టింది. అందుకే వారికి అందరూ పిచ్చి పట్టిన వాళ్ళలా కనిపిస్తున్నారు. మాస్కు అడిగినందుకు నగరి మున్సిపల్ కమిషనర్పై వేటు వేశారు.
కరోనా నివారించలేక చేతులెత్తేసి డాక్టర్లను కూడా బలిచ్చారు’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్లో పేర్కొన్నారు. అనంతరం ఆయన విశాఖ ప్రభుత్వ మానసిక వికలాంగులు ఆసుపత్రి లో డాక్టర్ సుధాకర్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వి అనిత కూడా ఉన్నారు.