తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ను పరామర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా నివాసంలో ఉన్న ఎమ్మెల్యే రాజేందర్ ను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాళ్ల దాడి ఘటన వివరాలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఘటనలో గాయపడ్డ వారి పరిస్థితిపైనా ఆరా తీశారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే అక్కసుతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తమను కూడా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ గూండాలు యత్నించి భంగపడ్డారన్నారు.