2బి బార్ల కేటాయింపు డ్రా పద్ధతిలో ఎంపిక అయిందని, ఎంపికైన దరఖాస్తుదారులు లైసెన్సు పొందవచ్చునని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు.
గురువారం వనపర్తిలో జిల్లా మద్య నిషేద అండ్ ఆబ్కారీ అధికారి కార్యాలయంలో డ్రా పద్ధతి ద్వారా 2బి బార్ ఎంపిక ప్రక్రియకు జిల్లా కలెక్టర్ హాజరై, ఆమె చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెబ్బేర్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీలలో 2B బార్ ఏర్పాటుకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, పెబ్బేర్ బార్ కొరకు (64), ఆత్మకూర్ బార్ కొరకు (28), అమరచింత బార్ కొరకు (9) దరఖాస్తులు, మొత్తం (101) దరఖాస్తులు స్వీకరించినట్లు ఆమె తెలిపారు.
ఈ డ్రా ప్రక్రియలో పెబ్బేరు మున్సిపాలిటీ నుండి (నెం.13) విశ్వనాథ్ శంకర్, s/o. బాలయ్య, ఆత్మకూరు మున్సిపాలిటీ నుండి (నెం.6) బండారు చాణక్య కుమార్, s/o. కృష్ణయ్య గౌడ్ ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అమరచింత మున్సిపాలిటీ ఎంపికను, తక్కువ ధరఖాస్తులు నమోదు అయిన కారణంగా ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
డ్రాలో ఎంపిక అయిన దరఖాస్తుదారుడు మొత్తం బార్ ఎక్సైజ్ పన్నుల్లో 1/3వ వంతుకు సమానమైన మొత్తాన్ని క్లియరెన్స్ జారీచేసిన తేదీ నుండి, మిగిలిన లైసెన్సు కాలానికి (90) రోజులలోపు చలాన్/ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి, లైసెన్స్ పొందాలని ఆమె సూచించారు.
తెలంగాణ బార్ రూల్స్ (6)వ నిబంధనలో నిర్దేశించిన అన్ని ఫార్మాలిటీలను (90) రోజులలోపు పూర్తి చేసి, సంబంధిత అధికారి ద్వారా లైసెన్స్ పొందాలని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో మద్యనిషేధం & ఆబ్కారీ శాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రత్యేకాధికారి నాగేందర్ రావు, డి.టి.ఎఫ్. ఇన్స్పెక్టర్ మల్లికార్జున బాబు, కొత్తకోట సీ.ఐ. ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి