ఆసుపత్రి వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు తప్పక పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కోరారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై బుధవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య సంబంధిత కేంద్రాలు బయో వేస్ట్ మేనేజ్మెంట్ కింద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేకరణ కోసం శ్వేత యామ్స్ కంపెనీ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు కావలసిన ఏర్పాట్లను చేయాలని పొల్యూషన్ బోర్డ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రిలో ఆరోగ్య కేంద్రాల వద్ద నుంచి బయో వేస్ట్ నిబంధనల ప్రకారం తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రామాలలో ఘన వ్యర్ధాలతో బయో వేస్ట్ కలవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే జిల్లాలోని వెటర్నరీ ఆసుపత్రిలో నుండి వెటర్నరీ బయోవేస్ట్ సేకరించేలా చర్యలు తీసుకోవాలని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ దయానంద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పివి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా