కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా,విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని మోసం చేసిందని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ.రామమోహన్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు ఫరూక్ హుస్సేన్ తీవ్రంగా విమర్శించారు.
శుక్రవారం నాడు కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే 25 వేల మందికి ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని ప్రకటించడం జరిగిందన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలేవి బిజెపి సర్కార్ అమలు చేయడం లేదని వారు తీవ్రంగా విమర్శించారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే విధానాలు అమలు చేస్తోందని వారు విమర్శించారు. జిల్లాలో బిజెపి నాయకులు వీధి సభలు, సమావేశాలు నిర్వహించి ఏం చెప్తారని వారు ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కడప జిల్లాలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బిజెపి ప్రభుత్వం, ప్రజల దగ్గరికి వెళ్లి సమావేశాలు నిర్వహించే అర్హత లేదని విమర్శించారు.
ఒకవైపు ఆదానికి, అంబానీలకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మరోవైపు ప్రజలపై భారాలను మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్ లో జరిగే జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూల్ మాజీ శాసనసభ్యులు ఎం.ఏ. గఫూర్ హాజరవుతున్నట్లు తెలిపారు. కావున కడప జిల్లా ప్రజానీకం సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.