గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఓబిసి విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ లో చర్చలు జరిపారు.
ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సమయం లేకపోవడం, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల పొత్తు కుదరలేదని ఆయన అన్నారు. ఏపీ, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్కల్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
భేటీ అనంతరం పవన్ స్పందిస్తూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్ రూపొందిస్తామని జనసేనాని వివరించారు. హైదరాబాదులో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే తమ కార్యకర్తలకు ఇష్టంలేకపోయినా జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు.