పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ.పి ప్రభుత్వం జీవో జారీ చేసినా, కేసీఆర్ జీవో కి వ్యతిరేకంగా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదని, ఆ జీవో అమలైతే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు, రైతులకు సాగు, తాగునీరు కరువవుతుందని బిజెపి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు.
ఆ జీవోపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కెసిఆర్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి ప్రజలకు న్యాయం దక్కేవరకు భారతీయ జనతా పార్టీ ప్రజా పోరాటాలను నిర్వహిస్తుందని అన్నారు.
ఆ జీవో వ్యతిరేకిస్తూ బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు హుజుర్ నగర్ పట్టణంలో నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.