కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, కర్ణాటకలో ‘అసంపూర్ణ ప్రభుత్వం’ ఏర్పాటు చేయవద్దని, మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి కర్ణాటకలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. బెంగళూరులో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్కు అధికారం దక్కడం అనేది అవినీతికి ఒక మార్గం వేయడమేనని అన్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందగా, ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన అన్నారు.
జేడీ(ఎస్)తో అనుబంధం ఉన్న వ్యక్తులు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందంటూ పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు.