అక్కడ ఒక అమ్మాయి ఫొటో దొరికింది. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉన్నది? తెలియడం లేదు. చెప్పేవారు లేరు. నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో తెలియదు. అత్యంత గోప్యంగా నరబలి జరిగిందని అనుమానం. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని పోతపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తున్నది.
అర్ధరాత్రి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గుప్త నిధులు వెలికి తీసేందుకు క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకున్నారు. అర్ధరాత్రి అడవి నుంచి శబ్దాలు వస్తుంటే గ్రామస్తులకు అనుమానం వచ్చింది. గ్రామస్తులు గుంపుగా వెళ్లి అక్కడ చూశారు.
అవాక్కైన గ్రామస్తులు క్షుద్ర పూజలు చేస్తున్న సమయంలో వారిని పట్టుకున్నారు. పట్టుకొని విచారించగా గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్నామని వారిచ్చిన సమాధానంతో ఒక్క సారిగా గ్రామస్తులు నిశ్చేష్టులయ్యారు. దాంతో సర్పంచ్ దాసరి చంద్రమౌళి ఎస్ ఐ చెంచు రమేష్ కు తెలియజేయడంతో రాత్రికి రాత్రి ఎస్ ఐ రమేష్ గ్రామస్తుల నుండి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
గుంట్ల పేట్ సర్పంచ్ దాసరి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై చుంచు రమేష్ కథనం ప్రకారం ఎనిమిది మంది క్షుద్ర పూజల గురించి వచ్చారని చెప్పారు. వారిని బికాస్ గరామి( 39) నజ్రుల్ నగర్ ఎంపీటీసీ, శంభు మండల్(35), రామకృష్ణ పాల్(45), కృష్ణ గుప్తా(45), సచిన్ మండల్(40), దిలీప్ బీశ్వాస్(45), మధ్యప్రదేశ్ కు చెందిన నీమాయ మండల్(60), శంకర్ సర్కార్(55), గా గుర్తించించారు.
వారి వద్ద పూజ సామాను, ఒక కారు, 8 చరవాణి లు, 22 వేల రూపాయల నగదును, ఒక మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకున్నారు. అనంతరం వారిపై ట్రెజరర్ త్రో 379 యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ ఒక యువతి ఫొటో దొరికింది. ఆ ఫొటోలో ఉన్న యువతి ఏమైంది అనేది అంతు చిక్కడం లేదు.
అక్కడ కొన్ని ఎముకలు ఉన్నాయి. అవి ఆ అమ్మాయివా? ఆ అమ్మానికి నరబలి ఇచ్చారా? తెలియదు. సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి దొరికితే గానీ నిజాలు తెలియవు. ఈ ప్రాంతంలో యువతి మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.