37.2 C
Hyderabad
April 30, 2024 14: 55 PM
Slider కృష్ణ

రక్తదానం చేస్తున్న విద్యార్థులు మానవతావాదులు

#ministerrkroja

సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నేటి యువతలో ఉందని దేశ భవిష్యత్తు నేటి యువత మీదే ఆధారపడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్.కే. రోజా అన్నారు. 

విజయవాడలోని కే.బి.ఎన్ కళాశాలలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మరియు కే.బి.ఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం మంత్రి ఆర్.కే. రోజా ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ మనిషి ప్రాణాలను కాపాడే రక్తాన్ని దానం చేస్తున్న నేటి విద్యార్థులు మానవతా వాదులని మంత్రి అన్నారు. 

ఒకరు ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణాన్ని నిలుపుతుందని రక్తదానంతో పాటు నేత్ర, అవయువదానం పై కూడా అవగాహనా కలిగి ఉండాలని  మంత్రి అన్నారు.  కోవిడ్ సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోయామని అందువల్లనే రక్త నిల్వలు తగ్గి పోయాయని ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతీ ఒక్కరూ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 

అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న

విద్యార్థి దశనుండే సేవాభావంతో పనిచేస్తున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని,  సమాజంలో అన్ని దానాలకంటే రక్త దానం గొప్పదని ఈరోజు రక్తదాన శిబిరంలో 500 మంది విద్యార్థులు రక్తాన్ని దానం చేసారని మంత్రి అన్నారు.  సమాజం పట్ల శ్రద్ద బాధ్యతతో ప్రతి విద్యార్థి మెలగాలని చదువుతో పాటు సమాజ సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 48 రక్త దాన శిబిరాలను నిర్వహించి 2 వేల 395 యూనిట్ల రక్తాన్ని దాతల నుండి సేకరించామన్నారు.  ఇటువంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా యువతలో రక్త దాన ఆవశ్యకతను తెలియజేసి వారిని  ప్రోత్సహిస్తున్నామన్నారు.  యువత అభిరుచులకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కార్యక్రమాలను రూపొందించి అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధి చెందేలా అమలు చేస్తున్నారన్నారు. 

రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపేది యువతే అని నమ్మిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేటి యువతకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి యూత్ ఐకాన్ అని మంత్రి అన్నారు.  యువజన సర్వీసుల శాఖ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత సాధికారిత కోసం వారి సర్వతో ముఖాభివృద్దికి వారి శక్తి సామర్ధ్యాలను దేశ పునంనిర్మాణం వైపు నడిపించడానికి రాష్ట్రంలో అనేక యువజన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 

ప్రతీ ఏటా రాష్ట్ర జిల్లా స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించడం ద్వారా యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించి విజేతలైన వారికి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బహుమతులు అందిస్తున్నామన్నారు.  యువతలో వ్యక్తిత్వ వికాసం మరియు భావ వ్యక్తీకరణ వృత్తి నైపుణ్యం పై శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలను ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి రోజా అన్నారు. 

రాష్ట్రంలో ఈ సంవత్సరం నుండి 10వ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ స్థాయి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, వృత్తి నైపుణ్యం పై అవగాహనా శిబిరాలు నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.  యువతలో వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, జాబ్ మేళాలు నిర్వహిస్తూ,   ప్రతీ గ్రామంలోను ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి యువతకు సామజిక సేవపట్ల ఆసక్తి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. 

మాదక ద్రవ్యాలను అరికడుతున్నాం

మాదక ద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే చెడు పరిణామాలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైం, దిశా చట్టం పై అవగాహనా కల్పించడం ద్వారా నేటి యువతను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్నామన్నారు.  ప్రతి నియోజకవర్గంలోనూ యువజనోత్సవాలను నిర్వహించి యువతలో దాగిఉన్న కళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.  రాష్ట్రంలోని క్రీడా మరియు సాంస్కృతిక శాఖల సమన్వయంతో యువతకు క్రీడల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పోటీలను నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు.

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ కే.బి.ఎన్ కాలేజీ విద్యార్థులు సేవ కార్యక్రమాలలో ముందంజలో ఉంటారని అన్నారు.  ఈ మెగా క్యాంపు లో 500 మంది విద్యార్థులు రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం అన్నారు.  ఈ యువత సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జి. వాణి మోహన్ మాట్లాడుతూ యువతను చైతన్య పరుచుట ద్వారా సమాజ సేవలో వారిని భాగస్వాములను చేస్తున్నామని ఈ దిశగా రాష్ట్రంలోని యువత అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారని అన్నారు.  యువత శక్తి సామర్ధ్యాలను దేశ, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా నేటి యువతకు యువజన సర్వీసుల శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాణి మోహన్ అన్నారు.

రక్తదానంలో పాల్గొన్న 500 మంది విద్యార్ధులు

యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే నేటి విద్యార్థులు సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా అవసరమైన తోడ్పాటును యువజన సర్వీసుల శాఖ అందిస్తున్నదన్నారు.  కె.బి.ఎన్ కాలేజ్ లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో గుంటూరు జె కె సి కాలేజ్, హిందూ ఫార్మసీ కాలేజ్, పాలిటెక్నిక్ కళాశాల, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ, విజయవాడ ధనికుల ఇంజినీరింగ్ కాలేజ్, యూ ఆర్ సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్. ఆర్. కె. ఇంజినీరింగ్ కాలేజ్, ఈ ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేసారని నాగరాణి అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ పి. శ్రీ లక్ష్మి, రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కుడిపూడి సత్య శైలజ, నగరం లోని కార్పొరేటర్ లు, సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ కృష్ణ, కే.బి.ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరావు, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కోలుకుంటున్న సినీ నటుడు శరత్ బాబు

Bhavani

నెదర్లాండ్స్ పై భారత్ ఘనవిజయం

Satyam NEWS

నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్

Satyam NEWS

Leave a Comment