నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో ఎముక మజ్జ మార్పిడి సౌకర్యం అందుబాటులోకి రావడం గర్వకారణమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి క్యాన్సర్ విభాగం లోని బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ యూనిట్ ను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోని కొన్ని పెద్ద నగరాలకే పరిమితమైన ఈ వైద్య సౌకర్యం నెల్లూరుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మెడికవర్ ఆస్పత్రిని భారత దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రారంభించారని కొనియాడారు.
ఆసుపత్రి యజమాని నెల్లూరు వాసి కావడం మనమందరం గర్వించదగిన విషయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
అందువలన ప్రతి జబ్బును ఆరోగ్యశ్రీ కింద నమోదు చేశారని కొనియాడారు. ఇటువంటి సౌకర్యం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, వైసిపి నేతలు, కార్యకర్తలు, ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.