అసెంబ్లీ సాక్షిగా వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులను అవహేళన చేయడం దారుణమైన విషయమని రాష్ట్ర గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిని నివారించకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చిందించడం చూస్తే నాటి కౌరవసభలో ద్రౌపది చీరను లాగేస్తుంటే రారాజు దుర్యోధనుడు వికటాట్టహాసం చేసినట్లుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు పుత్రిక, నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, హెరిటేజ్ సంస్థ అభివృద్ధి, నారా వారి కుటుంబ వ్యవహారాలు తప్ప ఏనాడూ బయటకు రాలేదని ఆయన అన్నారు.
రాజకీయాలు పట్టించుకోని మహా ఇల్లాలు, మహా తల్లి అని అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నారా భువనేశ్వరి ని గురించి మాట్లాడేందుకు మంత్రులుకి నోరు ఎలా వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవహేళనంగా మాట్లాడడంతోనే వైసీపీ, జగన్ పతనం ప్రారంభమైందని వారు నిశితంగా విమర్శించారు. ఎంతో ఉన్నత విలువలతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడమే కాక రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులను సైతం నియమించే శక్తి వంతుడిగా ఎదగడమే కాక భారతదేశంలోనే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మివేయడం లాంటిదేనని వారు స్పష్టం చేశారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మను విమర్శించి, తరువాత తన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పారని, నేడు చంద్రబాబు కుటుంబానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని ఎంత వాస్తవమో అంతే వాస్తవమని ధీమాను దాసరి రాజా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు తదితరులు ఉన్నారు.