వనపర్తి నియోజకవర్గంలో
బి ఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు చేయడం, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నియోజక వర్గ నాయకుడు, పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడు మేఘారెడ్డి చెప్పారు.
వనపర్తిలో అయన విలేకరులతో మాట్లాడుతూ కేసులకు భయపడే వారు ఎవరు లేరని అన్నారు. వనపర్తి జిల్లాలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి అధికారులు సైతం బి ఆర్ ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ నెల 20న ఏఐసీసీ జాతీయ స్థాయి నాయకత్వ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగకు వనపర్తి నియోజకవర్గం నుంచి 30వేల నుంచి 35 వేల మందిని తరలించనున్నట్లు చెప్పారు. కేసిఆర్ పార్టీకి పతనం ప్రారంభమైందని, రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది నాయకులు, ప్రజా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
వనపర్తి నియోజకవర్గ పరిధి నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతినిత్యం తప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వనపర్తి నియోజకవర్గంలో పెద్ద, చిన్న, కొత్త, పాత లాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు.
వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసేందుకు ఎవరితోనైనా కలిసి పని చేస్తామని ఎవరినైనా కలుపుకొని ముందుకెళ్ళేందుకు తమందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కౌన్సిలర్లు బ్రహ్మం చారి, రాధాకృష్ణ, నేతలు సాయి చరణ్ రెడ్డి, రమేష్ గౌడ్ , సత్య రెడ్డి, సత్యశీలరెడ్డి, టి ఎం ఆర్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్