ప్రకాశం జిల్లా వేటపాలెం పారిశ్రామికవాడ అక్రమాలకు నిలయంగా మారింది. జీడిపప్పు పరిశ్రమల యాజమానులు చట్టవిరుద్ధంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం జీడి గింజలను బాయిల్ చేసే విధానం కాకుండా కాల్చు(రోస్టింగ్) పద్దతులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు
దీంతో వేటపాలెం పరిసర ప్రాంతాల్లో తీవ్ర పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెలసరి మాముళ్ళకు అలవాటుపడిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జీడిపప్పు పరిశ్రమల యాజమాన్యాలకు సహకరిస్తున్నారు.
పరిశ్రమ యాజమాన్యం వారు సదరు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కాలపు పని పద్ధతుల కారణంగా కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యాజమాన్యాలు, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం విధానం ప్రకారం పాత విధానంలో జీడిగింజలు కాల్చు విధానానికి స్వస్తి పలికి బాయిలింగ్ విధానం అమలు చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ జీడిపప్పు పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వ అధికారుల అండదండలతో 2018 నుండి చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.
పెద్ద ఎత్తున జీడిపప్పు వ్యాపారం చేసే వెంకట శివసాయి కాష్యు ఆధ్వర్యంలో పలు జీడిపప్పు పరిశ్రమ యాజమానులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినా ముడుపుల కారణంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గా ఉంటున్నారు.
చట్టవిరుద్ధంగా జీడిపప్పు పాకం తయారీ చేయడమే కాకుండా తయారీలో పంచదార బెల్లం వినియోగానికి బదులుగా గ్లూకోజ్ వినియోగించి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయములపై వివిధ దినపత్రికలలో వార్తా కధనాలు వచ్చినప్పటికీ అవినీతి రాజకీయ అండదండలతో, సదరు ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.
జీడిపప్పు పరిశ్రమ యాజమాన్యములపై పూర్తి చట్టపరమైన చర్యలు తీసుకుని వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి, జీడిబట్టీల కార్మికుల ఆరోగ్యానికి, ప్రాణరక్షణకు చర్యలు తీసుకుని, సదరు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్న సదరు యాజమాన్యాలకు సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.