ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అరెస్టులు జరిగినట్లు తెలిసింది.
ఎర్రం గంగిరెడ్డి ని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కడప జిల్లా తుమ్మలపల్లి ఎర్రం గంగిరెడ్డి సొంత ఊరు కాగా అక్కడ కూడా సీబీఐ అధికారులు సోదాలు చేశారు.
అదే విధంగా ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన సునీల్ సొంత ఊరు మోట్నూతల పల్లెలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. మరో అనుమానితుడు ఉమా శంకర్ రెడ్డి ఇంట్లో ఆయుధాల కోసం సోదాలు జరిగాయి.
ఉమా శంకర్ రెడ్డి అన్న జగదీశ్వర్ రెడ్డి ని పొద్దుటూరు లో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. అదే విధంగా దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు చేశారు.
ఎట్టకేలకు వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. పులివెందులలోని సునీల్ యాదవ్ ఇంట్లో, తోండూరులోని ఎర్రం గంగిరెడ్డి ఇంట్లో, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు జరపగా ఎక్కడ ఈ ఆయుధాలు దొరికాయో వెల్లడి కాలేదు.
జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని సునీల్ యాదవ్ చెప్పడంతో తమదైన శైలిలో విచారణ జరపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.