కరోనా నివారణకు మాస్కులు అడిగిన కేసులో సస్పెండ్ అయిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావు కేసులో హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ పోలీసులు రంగంలోకి దిగారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తు బాధ్యత తీసుకున్న సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
డాక్టర్ సుధాకర్ అభియోగాల మేరకు విశాఖపట్నంలో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో డాక్టర్ సుధాకర్ చెప్పిన విషయాల ఆధారంగా ఆ కేసు నమోదుచేశారు.