వలస కూలీలను ఆదుకోవడంలో నరేంద్రమోడీ పూర్తిగా విఫలం అయ్యారు- ఇదీ ఆరోపణ. ఈ ఆరోపణలను మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నది. యధాశక్తి సోషల్ మీడియాలో కూడా పుంఖాను పుంఖాలుగా పోస్టింగులు వచ్చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించకుండానే లాక్ డౌన్ పెట్టేసిందని, వలస కూలీల ఇబ్బందులను గమనించకుండానే లాక్ డౌన్ పొడిగించేస్తున్నదని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆరోపణలు వస్తున్నది నరేంద్ర మోడీ పైన కదా మనకెందుకు అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ మౌనంగా ఉంటున్నాయి.
పైగా ఇదే అదనుగా మోడీపై మరింత అనుమానాలు వచ్చే విధంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. అసలు వాస్తవం తెలిస్తే దోషులు ఎవరో ఇట్టే అర్ధం అయిపోతుంది. కానీ అసలు విషయం ఎవరూ చెప్పరు. ఎందుకంటే వాస్తవం చెబితే రాజకీయంగా ఎవరికీ లాభం లేదు.
ప్రజల్ని భ్రమల్లో ఉంచితేనే కదా రాజకీయ లాభం
ప్రజలను భ్రమల్లో ఉంచితేనే వారికి లాభం. కేంద్ర ప్రభుత్వం వలస కూలీల గురించి పకడ్బంది ప్రణాళిక రచించింది. కేంద్రం రచించిన ప్రణాళిక ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ వల కార్మికుల వివరాలు ఆధార్ కార్డు తో సహా సేకరించాల్సి ఉంటుంది.
రాష్ట్రాలలో యంత్రాంగం ఉండేది రాష్ట్ర ప్రభుత్వాలకే కాబట్టి కేంద్రం వివిధ రాష్ట్రాలు ఇచ్చే లెక్కలపై ఆధారపడి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలదు. తీసుకున్నవాటిని అమలు చేయగలదు. అలా కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 4 కోట్ల మంది వలస కార్మికుల లెక్కలు పంపాయి.
దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల మందే ఉన్నారా వలస కార్మికులు అని అడిగే వారు కేంద్రాన్ని కాదు రాష్ట్రాలను అడగాల్సి ఉంటుంది. నాలుగు కోట్ల మంది వలస కార్మికుల వివరాలు వారి ఆధార్ నెంబర్ తో సహా పంపాలని కేంద్ర అడిగితే రాష్ట్రాలు ఇచ్చింది ఇవి మాత్రమే.
రెండు విడతలుగా డబ్బులు ఇచ్చేసిన కేంద్రం
ఇలా తమకు వచ్చిన వివరాల ప్రకారం వలస కార్మికులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు, వారికి మూడు పూటలా భోజన వసతి సౌకర్యాల కోసం ఏప్రిల్ నెలలో 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రాలకు వారు పంపిన లెక్కల ప్రకారం విడుదల చేసింది.
అదే విధంగా మే నెలలో 11 వేల కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు జమ చేసింది. మరి ఈ 23 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఖర్చు చేశాయి? ఎవరికి ఖర్చు చేశాయి? ఈ ప్రశ్నలు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలను తప్ప నరేంద్ర మోడీని కాదు.మరో 12 వేల కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు నెలల్లోనే సర్దుబాటు చేసింది.
ఏ తప్పూ దొరకనందునే ఈ సమస్య
అయితే అందరూ నరేంద్ర మోడీ వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శిస్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ నుంచి వామపక్ష పార్టీల వారికి కరోనా లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లో ఎలాంటి తప్పులూ దొరకలేదు రాజకీయం చేయడానికి. కేవలం వలస కార్మికుల సమస్య ఒక్కటే దొరికింది.
అందుకే గ్రామ గ్రామానా వామపక్ష పార్టీలు ధర్నాలు చేస్తుంటాయి. నరేంద్రమోడీ విఫలం అయ్యాడని విమర్శిస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ ను, వై ఎస్ జగన్ ను ఈ ప్రశ్న వేస్తే ఏంజరుగుతుందో వారికి తెలుసు అందుకోసం దూరంగా ఉన్న మోడీనే ప్రశ్నిస్తూ ఉంటారు. బిజెపీనే బద్నాం చేస్తూ ఉంటారు.
వామపక్షాల ప్రచార ప్రభావంతో టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులు కూడా మోడీనే ప్రశ్నిస్తారు తప్ప రాష్ట్రాల ముఖ్యమంత్రులను కాదు. ఏకపక్ష వార్తలతో సంతృప్తి చెందడం, నిజమేమిటో చెప్పకుండా పదిమంది చెప్పినది మాత్రమే ప్రచారం చేయడమే మీడియా పని. ఏం చేస్తాం?