దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘాలు పిలుపులో భాగంగా డిసెంబర్ 30న చలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున కార్మికవర్గం కదిలి రావాలని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఎస్ డబ్ల్యు సి గోదాం సింగారం హమాలీల సి ఐ టి యు అనుబంధం సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ గడ్డకట్టే చలిలో కటిక నేల మీద, రోడ్లమీద, నెల రోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీలో బైఠాయించి రహదారులను దిగ్బంధం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైంది కాదని, దీనికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రైతుల ద్వారా వేలాది మంది హమాలీలతో పాటు అనేక మంది ఆధారపడి బతుకుతున్నారని, నూట ఇరవై కోట్ల భారత ప్రజలకే కాకుండా ఇతర దేశాలకు అన్నం పెట్టే రైతులని బాధ పెట్టడం సరైంది కాదని అన్నారు.
SWC హమాలీలకి పీఎఫ్, ఈఎస్ఐ కల్పనతో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరంలో 6 నెలలు హమాలీలకు పని దొరుకుతుందని, మిగతా ఆరు నెలలకి కనీసం నెలకి పదివేలు చొప్పున ప్రతి కార్మికుడికి ఇచ్చి గోదాం యజమాన్యం జీవనోపాధి కల్పించాలని కోరారు.
ఢిల్లీ నగరంలో వీరోచితంగా పోరాడుతూ 33 మంది అమరులైనారని,కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని తక్షణమే మూడు వ్యవసాయ కార్మిక చట్టాలను రద్దు చేయాలని హమాలీ యూనియన్ తీర్మానించటం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో SWC హమాలి యూనియన్ సి ఐ టి యు అనుబంధ సంఘం అధ్యక్షుడు మోత్కూర్ వెంకటేశ్వర్లు, మల్సూర్, కోటేశ్వరరావు, నాగయ్య, హరి, రాములు, పుల్లయ్య, లంబాడి రాములు,తదితరులు పాల్గొన్నారు.