ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకాలనీ సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడ్డ సయ్యద్ జమీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 18వ తేదీన ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపాల్ మాజీ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో సయ్యద్ జమీర్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
వెంటనే ఆయన్ను స్థానిక రిమ్స్కు తరలించగా అక్కడి డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ హస్పిటల్కు అదే రోజు రాత్రి తరలించారు. అక్కడ తొమ్మిది రోజులుగా ట్రీట్మెంట్ పొందిన జమీర్ శరీరం నుంచి డాక్టర్లు బుల్లెట్లు తొలగించడంతో పరిస్థితి విషమించి శుక్రవారం అర్దరాత్రి ఆయన మృతి చెందాడు.
ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా ప్రస్తుతం ఒకరు నిమ్స్లో మరొకరు, మరోకరు స్థానిక రిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఫారుక్ అహ్మద్ ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
పకడ్బందీ పోలీస్ బందోబస్తు
సమాచారమందిన వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీస్యంత్రాంగం కాలనీలో పకడ్బందీ బందోబస్తు ను ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా 300మంది పోలీసులతో కాలనీలో ప్రత్యేక పోలీస్ ఫికెటింగ్ ను ఏర్పాటు చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.
పోస్టుమార్టం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు మృతుడి డెడ్బాడీ జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా ఇంచార్జీ ఎస్పీ , రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత నడుమ డెడ్బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు జరిగే వరకు కాలనీలోనే ఉన్న సీపీ ఘటనకు సంబంధించిన కుటుంబ సభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ జమీర్ అంత్యక్రియలను నిర్వహించారు. సీపీతో పాటు జిల్లా ఓఎస్డీ ఎం.రాజేష్ చంద్ర, ఆదిలాబాద్, మంచిర్యాల డిఎస్పీలు వెంకటేశ్వర్రావు, ఉదయ్ కుమార్ రెడ్డిలు అంత్యక్రియలు ముగిసేవరకు దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు.