చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవన నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గుయిజౌ ప్రావిన్స్లోని బిజీ నగరంలో రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు.. ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని రిస్య్కూ బృందాలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి కండిషన్ స్థిరంగా ఉన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సహాయక చర్యల కోసం రాత్రికి రాత్రే వెయ్యి మందితో కూడిన ప్రత్యేక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
అయితే, సంఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుయిజౌ ప్రావిన్స్ అతి తక్కువ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. అక్కడ పర్వతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. 2019లో కూడా గుయిజౌ ప్రావిన్స్లో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఆ సయమంలో 16 మంది మృతి చెందారు. 30 మంది గల్లంతయ్యారు.