ఇంగ్లీష్ మీడియం విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ కె ఎం జోసెఫ్, జస్టిస్ ఇందు మల్హోత్రా లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ స్టే ఎత్తేయాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రగతి శీల నిర్ణయానికి రాష్ట్ర హైకోర్టు స్టే అవరోధంగా ఉందని ఆయన చెప్పారు.
అయితే ప్రాధమిక స్థాయిలో మాతృభాష ఉండాలనే నిబంధనల ప్రకారం హైకోర్టు స్టే ఇచ్చినట్లు కనిపిస్తున్నదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. విద్యా హక్కు చట్టంలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదని సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ అన్నారు.
విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించారు. ప్రతివాదుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర నారాయణన్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని అన్నారు.
తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతివాదుల తరఫు న్యాయవాది చెప్పారు. ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.