అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి జరిగిన ఘర్షణలో చైనా సైనికులు ఎక్కువ మంది గాయపడ్డారని అరుణాచల్ తూర్పు బీజేపీ ఎంపీ తపిర్ గావో వెల్లడించారు. భారత్ వైపు నుంచి 20 మంది సైనికులు గాయపడగా, గాయపడిన చైనా సైనికుల సంఖ్య రెండింతలు ఎక్కువ అని ఆయన అన్నారు.
భారత సైనికులు తమ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లరని ఆయన అన్నారు. బిజెపి ఎంపి తపిర్ గావో మాట్లాడుతూ, “ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది సైనికులు గాయపడ్డారని నాకు తెలుసు, కానీ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) ఎక్కువ నష్టపోయింది. భారత సైనికులు తమ భూమి నుండి ఒక్క అంగుళం కూడా కదలరు. చైనా ఆర్మీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. “మెక్మాన్ లైన్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం భారత్-చైనా సంబంధాలకు చేటు.. చైనా ఆర్మీ చేసిన పని చాలా తప్పు.. ఎందుకంటే సరిహద్దుల్లో మన భారత సైనికులు పహారా కాస్తుంటారు.. చైనా ఎంత ప్రయత్నిస్తే భారత సైనికులు అంతకు రెట్టింపు శక్తితో స్పందిస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితి గురించి సమాచారం ఇస్తూ, భారత సైన్యం, ITBP అన్నీ బృందాలూ తవాంగ్ చేరాయని గావో చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితి చాలా సున్నితంగా ఉంది, కానీ అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. LAC వెంబడి డిసెంబర్ 9న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) నిర్మాణాలు కనిపించాయి.
భారత ఆర్మీ సిబ్బంది వారిని అలా చేయకూడదని నిషేధించారు. ముందుకు సాగకుండా వారిని గట్టిగా అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడ్డారు. వాగ్వివాదం ముగిసిన వెంటనే ఇరువర్గాలు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ సంఘటన తరువాత, భారతీయ స్థానిక కమాండర్ చైనా వైపు కమాండర్తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించే మార్గాలపై చర్చించారు. తవాంగ్లో ఎల్ఏసీలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ ఇరుపక్షాలు తమవేనని, ఇరు దేశాల సైనికులు ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రెండ్ 2006 నుంచి కొనసాగుతోంది.