సీఐడీ అధికారులు తనను కొట్టారంటూ తెదేపా మీడియా ఇన్ఛార్జి దారపనేని నరేంద్ర న్యాయమూర్తి ఎదుట వాపోయారు. నరేంద్రను నిన్న అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఈరోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించాలని ఆదేశించారు. నివేదక అందిన తర్వాత రిమాండ్ విషయం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల పోస్టుల కేసులో నరేంద్ర ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. తనకు జండూబామ్ రాసి మరీ కొట్టారని నరేంద్ర వాపోయారు. నరేంద్రను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో నరేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు.
కోర్టు వద్ద తనను కలిసిన న్యాయవాదులు, తెదేపా నేతల ముందు నరేంద్ర కన్నీరు పెట్టుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనను హింసించారని, ఐదుగురు వ్యక్తులు ఇందులో పాల్గొన్నారని వారికి వివరించారు. దెబ్బలు బయటకు కనిపించకుండా కొట్టారని ఆవేదన వెలిబుచ్చారు. సీఐడీ అధికారులు నరేంద్రను కోర్టుకు వచ్చేసరికి కోర్టు సమయం ముగిసింది. దీంతో న్యాయమూర్తి అనుమతి తీసుకుని నరేంద్రను జడ్జి ఇంటికి తీసుకెళ్లి హజరుపర్చారు. నరేంద్రను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సందర్భంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. న్యాయమూర్తి నివాసానికి వెళ్లే మార్గాలను మూసి వేశారు.
గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం వ్యవహారంపై.. సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబు గతంలో ఓ పోస్టును షేర్ చేశారు. దాన్ని నరేంద్ర కూడా షేర్ చేశారంటూ సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ అధికారులు విచారించారు. బంగారం పట్టుబడిన వ్యవహారంపై నరేంద్ర నుంచి పోస్టు వచ్చినట్లు విచారణలో ఆయన వెల్లడించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి నరేంద్రను అరెస్ట్ చేశారు.