G20 దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ ముందుకు సాగుతోందని, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంపై తనదైన ముద్ర వేస్తుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి ఒక సంవత్సరం పాటు భారత్ G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఆ తర్వాత G20 లీడర్స్ సమ్మిట్ 2023 సెప్టెంబర్ 9,10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా వాషింగ్టన్లో జార్జివా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి చీకటిలో మెరుస్తున్న నక్షత్రం గా చెప్పడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. భారత్ అభివృద్ధి, కష్ట సమయాల్లో కూడా, నిర్మాణాత్మక సంస్కరణలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
భారతదేశంలోని నిర్మాణాత్మక సంస్కరణలు డిజిటల్ ఐడి నుండి డిజిటల్ యాక్సెస్ ఆధారంగా అన్ని సేవలు పురోగమిస్తున్నాయని అన్నారు. డిజిటలైజేషన్ భారత్ ఆర్ధిక విజయానికి ముఖ్య కారణమని వివరించారు. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ మాట్లాడుతూ పేదలకు చేరే సామాజిక భద్రతా కార్యక్రమాలను రూపొందించడానికి భారతదేశం డిజిటలైజేషన్ నుంచి మంచి ప్రయోజనాన్ని పొందిందని అన్నారు.
ఇటీవలి ప్రపంచ బ్యాంక్ పేదరిక నివేదిక ప్రకారం, కొన్ని దేశాలు నగదు బదిలీ వ్యవస్థలు మరియు డిజిటలైజేషన్ ద్వారా COVID-19 వల్ల పేదలకు కలిగే దెబ్బను తగ్గించగలిగాయని అందులో భారత్ ఒకటని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ హెచ్చరించారు.