ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరణ, రైతుల వెన్ను విరిచే చట్టాలు తీసుకొచ్చిందని CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.
ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వంపై పోరాటాలకు సమాయత్తం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్మికుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న హక్కులను, 44 చట్టాలను నాలుగు చట్టాలుగా చేసి అందులో యజమానులకు అనుకూలంగా, కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు చేయడం అన్యాయమని అన్నారు.
అంగబలంతో మీడియా గొంతు, ప్రతిపక్షాల గోంతు నొక్కి చట్టాలను సవరించడం భారతదేశంలో చీకటి రోజులకి తెరలేపినట్లుగా ఉందని, ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధం అని రోషపతి తీవ్రంగా ఆరోపించారు.
ఇదంతా చూస్తుంటే పెట్టుబడిదారులకు, అంబానీ లాంటి వారికి భారతదేశ సంపదని హోల్ సేల్ గా కట్టబెడుతున్నట్లుగా ఉందే తప్ప మరొకటి కాదని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చట్టాల సవరణ బిల్లును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్య గౌడ్, సాముల కోటమ్మ ,నరసమ్మ ,గోపమ్మ, వెంకన్న రాధా, లక్ష్మి ,మణి ,పద్మ తదితరులు పాల్గొన్నారు.