కార్తీక మాసం అంటే శివునికి సంబంధించిన మాసమనే చాలా మంది అనుకుంటారని, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన వ్యాస మహర్షి తాను రచించిన నారదీయ, స్కంద, పద్మపురాణాల్లోని కార్తీక మహాత్యంలో విష్ణువ్రతాలు, విష్ణుకథలు, విష్ణుస్మరణే ఎక్కువగా కనబడుతుందని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవదనాచార్యులు, మోహన రంగాచార్యులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి వివరించారు. తిరుమలలో శుక్రవారం సాయంత్రం వారు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశారు. అందులోని ముఖ్యాంశాలివి.
కరోనా మహమ్మారి భారతావనికి పాకిన ప్రారంభదశలోనే ప్రపంచాన్ని ఈ ఉపద్రవం నుంచి కాపాడాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ దేశం నలుమూలల నుండి సుప్రసిద్ధ పండితులను ఆహ్వానించి మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు టిటిడి శ్రీ శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపాన్ని నిర్వహించింది.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం, తిరుమల నాదనీరాజన మండపం, శ్రీవారి ఆలయంలో నేటికీ ధన్వంతరి మహాయాగం, యోగవాశిస్ట విషూచికా మహామంత్ర పారాయణం, పారమాత్మికోపనిషత్ పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
లోకకల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ఫలితంగా స్వామివారి దయతో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి 227 రోజుల తరువాత స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.
కరోనా మహమ్మారిని పూర్తిగా నాశనం చేయాలని స్వామివారిని ప్రార్థిస్తూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన అనేక విశేష ఆరాధనలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో శివునికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో రుద్రాభిషేకాలు, నవంబరు 29న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనంలోని మైదానంలో కోటి దీపోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన పురాణాల్లో చెప్పబడిన విశేషాలను దృష్టిలో ఉంచుకుని వాటిని దశదిశలకు వ్యాపింపచేయాలని సదుద్దేశంతో, హైందవ ధర్మాన్ని, పురాతన సంప్రదాయాలను పునరుద్ధరింపచేయాలనే సత్సంకల్పం, కరోనా వ్యాధిని సమూలంగా నిర్మూలించి తిరుమలశోభను, పవిత్రతను మరింత పెంచి సమాజంలో ధర్మాన్ని స్థిరపరిచి, యువతను సన్మార్గంలో పయనింపచేయడం లాంటి లోకకల్యాణ కారణాలు ఈ కార్యక్రమాల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశాలు.
ఈ కార్యక్రమాలన్నీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భక్తులు వీటిని ఆచరించడం ద్వారా అనంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను ఆచరించలేని వారు భక్తితో వీక్షించినా కూడా ఇదే ఫలితం దక్కుతుంది.
తిరుమలలో ఇప్పటికే శ్రీవారికి కార్తీక మాసంలో నాగుల చవితి నాడు పెద్దశేష వాహనం, కార్తీక పర్వ దీపోత్సవం, కైశిక ద్వాదశి, కార్తీక వనభోజనం, కార్తీక మాసం చివరి ఆదివారం బేడి ఆంజనేయస్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఆనవాయితీగా జరుగుతున్నాయి.