తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం తూపిలిపాలెం, దుగరాజపట్నం, జమీన్ కొత్తపాలెం పంచాయితీలకు చెందిన మత్స్యకారులు తిరుపతి లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తిని కలిశారు.
ఈ సందర్భంగా వారికి సంబందించిన పలు సమస్యలను ఎంపీ గురుమూర్తికి ఏకరువు పెట్టారు. ప్రధానంగా చేపల వేట విషయంలో తమిళనాడు మత్స్యకారులు స్పీడ్ బోట్లలో వచ్చి మన మత్స్య సంపదను అక్రమంగా చొరబడి దోచుకొంటున్నారని చిన్న చిన్న పడవలు కలిగిన మేము వారిని నిలువరించడం తమ శక్తికి మించిన పని అవుతుందని అన్నారు.
తమ జీవనం ప్రధానంగా చేపల వేటపై ఆధార పడి ఉన్నందువలన ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని ఎంపీని కోరారు. ఈ విషయంపై ఫిషరీస్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ బాబుతో మాట్లాడగా తమిళ మత్స్యకారులను నిలువరించేందుకు రెండు పెద్ద బోట్లని కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలవగా కేటాయించిన నిధులు సరిపోవని ఎవరూ ముందుకు రాలేదని తెలుపగా అందుకు ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ అవసరమైన నిధుల్ని ఎంపీ నిధుల నుంచి అందజేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే తూపిలి పాలెం గ్రామానికి బస్సు సౌకర్యం లేదని తెలుపగా వెంటనే ఎంపీ గురుమూర్తి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తో మాట్లాడి వెను వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. తీర ప్రాంత గ్రామాలలో రోడ్లు, మంచి నీటి సౌకర్యం వివరాలను వారినడిగి తెలుసుకున్నారు.