ములుగు జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని విహెచ్పిఎస్ కోరింది. ములుగు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేడు విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మంచోజు చంద్రమౌళి, ఎన్ పి ఆర్ డి ములుగు జిల్లా అధ్యక్షులు పొన్నం సంతోష్ గౌడ్ ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ అవుతున్న తరుణంలో భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలు దొరికే పరిస్థితి లేనందున ఇప్పుడే ఏర్పాటుచేయాలని కోరారు. చుట్టుప్రక్కల జిల్లాలలో కూడా దివ్యాంగుల కమిటీ హాల్స్ కి సంబంధించి 30 లక్షల చొప్పున నిధులు మంజూరై పనులు కూడా జరుగుతున్నాయని వారు వివరించారు.
ములుగు జిల్లా దివ్యాంగులకు సంబంధించి సమావేశం మందిరం లాగా కమిటీ హాల్ ఏర్పాటు చేయాలనే అంశం పై గతంలో పలుమార్లు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగినదని అన్నారు. జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే ,ఎంపీ, జడ్ పిపి ,ములుగ్ జడ్పిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు కూడ సహకరించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ వై వి.గణేష్, డిఆర్ఓ రమాదేవి వారి వినతి పత్రాన్ని స్వీకరించారు.