భూపాలపల్లి పట్టణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన జయశంకర్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజీం కు ఒక దృశ్యం కంటబడింది. అజ్మీర మంగమ్మ(70) అనే ఒక గిరిజన మహిళ కలెక్టర్ కార్యాలయ మెట్లపై కూర్చుని ఉన్నది.
కలెక్టర్ ఆఫీస్ లోకి నేరుగా వెళ్లిపోకుండా ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్లాడు. పేరూ ఊరూ కనుక్కున్నాడు. ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాడు. మంగమ్మ కు గత 2 సంవత్సరాలుగా పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన ఆమె నేడు జిల్లా కలెక్టర్ ను కలవడానికి వచ్చింది. సాక్ష్యాత్తూ కలెక్టరే తన వద్దకు వస్తాడని ఊహించిన మంగమ్మ ఆశ్చర్య పోయింది. ఆప్యాయంగా జిల్లా కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు ఆమె తన విషయం చెప్పింది. రెండు సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్ రావడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని జిల్లా కలెక్టర్ గారిని పెన్షన్ కోసం కలుద్దామని వచ్చా అని చెప్పింది. బహుశ ఆమెకు కలెక్టర్ ఎవరో కూడా తెలియదేమో. ఆమె చెప్పగానే వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి సుమతిని ఆదేశించి వృద్ధురాలికి పెన్షన్ అందజేశారు.