రవిశంకర్ గురూజీ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ (జీవన కళ) వేడుకలలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 75 లక్షల మొక్కలు నాటాలని సంకల్పం చేశారు.
దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పర్యావరణాన్ని కాపాడటం కోసం మన వంతుగా మొక్కలు నాటి పూజించి జీవితానికి సార్ధకత చేకూర్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త పైడిమర్రి రంగారావు,కామిశెట్టి కిరణ్ ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా రంగారావు,కిరణ్ మాట్లాడుతూ లక్ష్మీ స్వరూపమైన వేప,శ్రీ మహా విష్ణు స్వరూపమైన రావి,దత్తాత్రేయ స్వరూపం మేడి మొక్కలను నాటి పెంచాలని కోరారు.పూర్వ కాలంలో ప్రకృతి నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించారని అన్నారు.నేడు పర్యావరణాన్ని కాపాడటంలో అశ్రద్ధ చేయడంతో మానవ మనుగడకు తీవ్ర ముప్పు ఏర్పడిందని, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మానవాళి వింత వ్యాధులతో బాధపడుతూ లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యశాలల వెంట పరిగిడుతున్నారని,దీనికి పరిష్కారంగా వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటడమే పరిష్కార మార్గమని అన్నారు.
ప్రతి ఒక్కరూ తనవంతు కర్తవ్యంగా మొక్కలు నాటి,వాటి పెరుగుదలకు కృషి చేయాలని,ప్రకృతి లోని కాలుష్య నివారణకు నడుము బిగించి చైతన్య పర్చి భావితరాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించేందుకు ముందుకు రావాలని పైడిమర్రి రంగారావు,కామిశెట్టి కిరణ్ కోరారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్