ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సమగ్ర సర్వే చేసి నష్ట పరిహారం చెల్లిచాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ నుండి ప్రారంభమై నిజాంసాగర్ చొరస్తా వరకు దాదాపు 3000 మంది రైతులతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. అధికారులు నేరుగా రైతుల దగ్గరకి వెళ్లి పంట నష్టంపై సమగ్ర విచారణ చేసి నష్టపరిహారం తొందరగా అందేలా చూడాలన్నారు.
వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని, ఆ డబ్బులు బ్యాంకర్లు రుణాల కింద తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రాంతాన్ని డ్రాట్ ఏరియాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు రైతులు ట్రాక్టర్లలో వెళ్లారు. పోలీసులు కొంత మందికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతివ్వడంతో రైతుల బృధం వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.