క్యాసినోల వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరుగుతున్నదని, దీనివల్ల దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఇలాంటి క్యాసినో వ్యవహారాలు నిర్వహిస్తున్నవారిని, నిర్వాహకులకు అండగా ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ రాశారు.
గుడివాడ, హైదరాబాద్, ధాయ్ ల్యాండ్ అక్రమ క్యాసినోల వ్యవహారంపై ఈడీకి చేసిన ఫిర్యాదులో వివరాలు అందించారు. గుడివాడ కె-కన్వెషన్ సెంటర్ లో 2022 జనవరిలో అక్రమ క్యాసినో నిర్వహించారు. అమాయక ప్రజల నుంచి నిర్వాహకులు దాదాపు రూ.500 కోట్లు దోచుకున్నారు. గుడివాడ క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ లో సైతం అక్రమ క్యాసినో నిర్వహించాడు.
చీకోటి ప్రవీణ్ ను 2022 జూలైలో హైదరాబాద్ లో ఈడీ అదుపులోకి తీసుకుంది. అక్రమ క్యాసినో నిర్వహకులపై ఈడీ సమగ్ర విచారణ చేస్తున్నట్లు నాడు ప్రకటించింది. గుడివాడ, హైదరాబాద్ లలో అక్రమ క్యాసినో నిర్వహించిన వారే ఇటీవల ధాయ్ ల్యాండ్ లో సైతం క్యాసినో నిర్వహించి అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ధాయ్ ల్యాండ్ అక్రమ క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ నుంచి దాదాపు రూ.100 కోట్లు జప్తు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇంతటి పెద్దఎత్తున జరుగుతున్న మనీలాండరింగ్ తో జాతీయ భద్రతకు, దేశ ఆర్ధిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపద్యంలో అక్రమ క్యాసినోల నిర్వహణలపై సమగ్ర విచారణ చేసి నేరస్తులను సంబంధిత చట్టాలతో కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.