2వ బ్యాచ్ ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఈ-శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్ సీడీ రైటింగు శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – జిల్లాలో వివిధ పోలీసు స్టేషనులలో కంప్యూటరు, ఆంగ్ల పరిజ్ఞానం కలిగిన పోలీసు కాని స్టేబుళ్ళు కొరత ఈ-శిక్షణతో తీరనున్నదన్నారు.
ఈ శిక్షణ పొందిన తరువాత కానిస్టేబుళ్ళు పని తీరులో వచ్చిన మార్పును, శిక్షణ పొందక ముందు వారి పని తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కాలంలో వారు నేర్చుకున్న విషయాలను అడిగి తెలుసుకొన్నారు. ఇకపై ఈ-శిక్షణ పొందబోయే కానిస్టేబుళ్ళుకు ఉపయుక్తంగా ఉండే విధంగా శిక్షణలో చేయాల్సిన మార్పులపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
శిక్షణ అనంతరం, కాని స్టేబుళ్ళులో కంప్యూటరు, ఆంగ్ల పరిజ్ఞానం పెరిగినట్లు, ఇది స్టేషనులో నమోదైన వివిధ కేసుల దర్యాప్తు వివరాలను సొంతంగా కేసు డైరీలను తయారు చేసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళ సేవలను పోలీసు స్టేషనుల్లో వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.
శిక్షణ పొందిన కాని స్టేబుళ్ళు అందించిన సేవలను, పనితీరును పరిశీలించి, వారికి అదనంగా కొంత అలవెన్సును కూడా మంజూరు చేసి, ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. ఈ-శిక్షణలో ప్రతిభ కనబర్చిన విజయనగరం వన్ టౌన్ కాని స్టేబులు ఎస్. అజయ్ కుమార్, బుదరాయ వలస కానిస్టేబులు కె.శ్రీహరి, వల్లంపూడి కానిస్టేబులు ఎం.రమేష్ బాబులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డీసీఆర్బీ సీఐ డా.బి.వెంకటరావు, ఎస్ఐ తారకేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, ఈ-శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.