కరోనా వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను అంతరంగికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు.
భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 12న స్వామివారి తెప్పోత్సవం, 13న నిర్వహించే ఉత్తరద్వార దర్శనాలకు భక్తులను అనుమతించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తగూడెం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కొవిడ్ మూడోదశ వ్యాప్తి నేపథ్యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కేవలం కొద్దిమంది అర్చకులు, వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉత్తరద్వార దర్శనం ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు సదరు వెబ్సైట్ ద్వారానే నగదు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి భద్రాచలం రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఒమైక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యల్లో భాగంగా 10వ తేదీ వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. అందులో భాగంగా సామూహిక మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని భక్తులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.