ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 24000 రూపాయలు ఇవ్వాలని వచ్చే నెల ఫిబ్రవరి 23,24 తేదీలలో జరుగు దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు,కార్మికులు,ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల పెదవీడు గ్రామ శివారులో అమరేశ్వరి సిమెంటు ఫ్యాక్టరీ నందు వివిధ సిమెంట్ పరిశ్రమల కార్మికుల సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉద్యోగ,కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23,24 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రైవేటీకరణతో కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారని, బిఎస్ఎన్ఎల్,ఎయిర్ ఇండియా ప్రైవేట్ పరం చేశారని వీటితోపాటు రైల్వే,రక్షణ రంగం,బ్యాంకులు,ఇన్సూరెన్స్,ఓడరేవు, విశాఖ స్టీల్,ఎయిర్ పోర్ట్,రోడ్లు,ప్రభుత్వ భూములను,విద్యుత్ సంస్థలని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, భారతదేశ ప్రజల ఆస్తులను అన్యాయం చేస్తున్నారని అన్నారు. రైతుల పోరాటం లాగే ఉద్యోగులు,కార్మికులు,ప్రజలు అందరు ఐక్యంగా పోరాటం చేసి కాపాడుకోవాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండలం సి ఐ టి యు ప్రధాన కార్యదర్శి ఎస్ కె రణమియా, కార్మికులు హనుమాన్,ప్రభాకర్,రాజా, వెంకటేష్,మూస శ్రీను,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్