అన్నార్తులు, అనాథలు ఉండని తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ కలగన్నారని నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదల కడుపు నింపే పనికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఆలోచనతోనే అప్లైచేసుకున్న లబ్ది దారులకు రేషన్ కార్డులను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని పద్మావతి అన్నారు.
సోమవారం నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శర్మలతో కలిసి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కొత్తగా 5073 మంది అర్హులైన లబ్ధిదారుల ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
నాడు దండగ అన్న వ్యవసాయం నేడు పండగైంది
నాడు దండగ అన్న వ్యవసాయం ప్రస్తుత రోజుల్లో పండుగ అయిందని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని,అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు.
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నన్ని కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల మేలుకోసం సీఎం కేసీఆర్ దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలతో పథకరచన చేస్తున్నారన్నారు.
రైతుబంధు, రైతు బీమా, రైతుల పంట రుణాలు మాఫీ చేయడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ అందివ్వడం, గోదాముల నిర్మాణంతోపాటు వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. రైతుల దిగుబడి, తలసరి ఆదాయం పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తున్నదని తెలిపారు.
అందుకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వానాకాలం, యాసంగి రెండు పంటలకు ఏడు వందల కోట్ల రూపాయల ధాన్యం దిగుబడి చేసిందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేయడం జరిగిందని, వారందరికీ ఈ నెల చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు అందరికీ అందజేయడం జరుగుతుందనన్నారు.
ఆగస్టు మాసం నుండి నూతన రేషన్ కార్డు దారులు తమకు కేటాయించిన రేషన్ దుకాణాల నుండి రేషన్ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు జడ్పిటిసి, ఎంపీపీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.