ఘన విజయం సాధించిన కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలోని ఐదు అంశాలను ముందు ఉంచుకుని తదుపరి వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. రాబోయే లోక్సభ ఎన్నికలపై కాకుండా అతి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమౌతున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలకు రానున్నాయి. ముందుగా వీటికి సన్నద్ధం కావాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. వచ్చే వారం కాంగ్రెస్ పార్టీ దీని కోసం భారీ సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ భేటీలో పార్టీ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో కొందరు నేతలకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంపై హామీతో హిమాచల్ ప్రదేశ్ అధికారంలోకి రావడమే కాకుండా కర్ణాటక ఎన్నికల్లో ఐదు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ ఐదు వరాలతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీతో అనుబంధం ఉన్న సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇందులో ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దలకు నెలవారీ సహాయం, ఉచిత రేషన్, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగుల సమస్య పరిష్కారం ఉంటాయి. పాత పెన్షన్ను పునరుద్ధరించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులను నేరుగా ఆకట్టుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా కూడా మంచి ఫలితాలు రాబట్టువచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది.