సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే రైతులకు మేలు చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశగా నడిపించేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాల పరిశీలనకు వచ్చిన భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేడు సమావేశం అయ్యారు.
తెలంగాణలో సహకార వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సహకార రంగాలను పరిశీలిస్తున్నామని, మహారాష్ట్రలో రైతు సహకార సంఘాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
12 వేల నుండి 25 వేల మంది రైతులు కలిసి ఏకంగా చక్కెర కర్మాగారాలను లాభాలలో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు సమితుల ద్వారా రైతులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు.
రైతులకు వ్యవసాయంపై అవగాహన, మెళకువలు, రైతుల విజయ గాధలను తెలుసు కునేందుకు రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించామని తెలిపారు.