నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల మున్సిపాలిటీ లో సోమవారం కరోనా కలకలం సృష్టించింది. పట్టణ పరిధిలోని 1 వ వార్డులో ఉన్న శివనేనిగూడెం గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు ముంబాయి మహానగరంలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ కావడంతో వారికి అక్కడ ఉపాధి లేక అనేక అవస్థలకు గురయ్యారు. దీంతో ఇటీవల వలస కూలీలకు కల్పిస్తున్న వెసులుబాటు నేపధ్యంలో కుటుంబ సభ్యులతో సహా ఆదివారం రాత్రి బస్సుల ద్వారా స్వగ్రామం చేరుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోకి ముంబాయి నుండి వచ్చిన వారితో కరోనా వైరస్ వ్యాపిస్తుంది, వారికి కరోనా పాజిటివ్ ఉందని సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది. దీంతో సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకటరెడ్డి వైద్యాధికారి డాక్టర్ కిరణ్, ఇతర వైద్య సిబ్బందితో కలిసి ముంబాయి నుండి వచ్చిన వారింటికి హుటాహుటిన తరలి వెళ్లారు.
ఐతే వారిని ప్రయాణంలో తెలంగాణ సరిహద్దుల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా లేనట్లుగా ధ్రువీకరణ చేసినట్లు ధ్రువ పత్రాల ద్వారా తెలుస్తుంది. వారికి కరోనా లక్షణాలు లేనట్లుగా స్థానిక వైద్యులు కూడా తేల్చిచెప్పారు. దాంతో భయం గుప్పిట్లో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా వారిని21 రోజుల పాటు ఇల్లు వదిలి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, పరిసర ప్రాంత ప్రజలెవరిని కలవకూడదని సూచనలు చేశారు.