సాధారణంగా వేసవి సెలవుల్లో టీచర్లను తీసేసి మళ్లీ స్కూళ్లు తెరవగానే టీచర్లను పెట్టుకునే కార్పొరేట్ స్కూళ్లు ఇప్పుడు మొత్తానికి టీచర్లను తీసేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. కరోనా సమయంలో ఎవరిని తీసేయరాదు అనే నిబంధనను ఎలా ఉల్లంఘించాలి? అనే అంశంపై పిహెచ్ డి చేసిన కార్పొరేట్ కాలేజీల, స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన లేకుండానే టీచర్లను తీసేసేందుకు ఉద్యుక్తమయ్యాయి.
టీచర్లను తీసేసేందుకు కార్పొరేట్ కాలేజీలు పెట్టిన నిబంధనలు చూస్తూ కళ్లు తిరగక మానదు. వారికి ఇష్టమైన వారిని తప్ప వేరెవరిని ఉంచుకోకుండా ఉండేలా నిబంధనలు తయారు చేశారు. అందులో ప్రధానమైన నిబంధన ఏమిటంటే ఎవరైనా టీచర్ నెల రోజులుగా స్కూలుకు రాకపోయినా, లాస్ ఆఫ్ పే లో ఉన్నా వారిని తీసేయండి అని.
గత నెల రోజులుగా కరోనా నిబంధనల వల్ల టీచర్లు స్కూళ్లకు రాలేకపోయారు కదా? ఈ ఒక్క నిబంధనతో తమకు ఇష్టంలేని టీచర్లను తీసేయవచ్చునన్నమాట. రాబోయే రోజుల్లో కార్పొరేట్ కాలేజీలకు బిజినెస్ ఉండే అవకాశం లేదుకాబట్టి కూడా టీచర్లను తగ్గించుకుంటున్నారని అనుకోవాల్సి వస్తున్నది.
గత నెల రోజులుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించకపోయినా, ఫోన్ కాల్స్ అంటెండ్ కాకపోయినా, తల్లిదండ్రులకు వర్క్ షీట్లు పంపకపోయినా కిందటి నెల జీతం ఆపేయాలని కూడా కార్పొరేట్ కాలేజీలు ఆదేశాలు జారీ చేశాయి. పని చేసిన నెలకు కూడా జీతం ఇవ్వకుండా లాస్ ఆఫ్ పే అని పెట్టి జీతాలు కట్ చేసేయండి అని సర్క్యులర్ పంపారు. ఇంత క్రిమినల్ ఆలోచనలు ఉన్న వాళ్లు స్కూళ్లు, కాలేజీలు నడుపుతున్నారు. ఓ మై గాడ్.