రాష్ట్ర ప్రభుత్వం తాజా గా విడుదల చేసిన బదిలీ నిబంధనలోని డీఈఓ పూల్ భాషా పండితుల పాలిట శరాఘాతంగా పరిణమించిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
బదిలీ నిబంధనల జీవోలో భాషా పండితులకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు పొందుపరచలేదని సర్దుబాటులో స్థానాలు కోల్పోయిన వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించలేదని వారన్నారు. డీఈఓ పూల్ నుంచి సర్దుబాటు చేసిన కారణంగా పదేపదే వారు తమ స్థానాలను కోల్పోతూ వివిధ ప్రదేశాల్లో పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా నిబంధనలో ఈ మేరకు మళ్లీ బదిలీకి గురవుతున్నారని వారు అన్నారు. కోల్పోయిన తెలుగు,హిందీ,ఒరియా భాషా పండితులకు రేషన్లైజేషన్ పాయింట్లు అందించి వారికి న్యాయం చేయాలని కోరారు.