ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏపీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులకు, సిఆర్డిఎ బిల్లు రద్దుకు ఆమోదముద్ర వేసి ఉంటే శాసనమండలి రద్దు చేయకుండా ఉండేవారా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు కౌన్సిల్ రద్దు ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదని యధావిధిగా కొనసాగేదని చెబుతూ ఇదేం రాజకీయమని ఆయన అన్నారు.
శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి పంపిన బిల్లును తిరస్కరిస్తూ సెలక్ట్ కమిటీకి పంపడంతో శాసనమండలి రద్దుకు సిఎం కంకణం కట్టుకున్నారనేది స్పష్టమౌతున్నదని ఇది ప్రతీకార రాజకీయాల కిందికి వస్తుందని ఆయన అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నచందంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలి రద్దు ను వ్యతిరేకించడం అధికార పక్షంలో ఉన్నప్పుడు శాసన మండలి రద్దును స్వాగతించడం ఊసరవెల్లి రాజకీయాలు కాదా అని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
శాసనమండలిలో రాజకీయ నిరుద్యోగులకు అండగా ఉండే ఎమ్మెల్యేల కోటా,గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీలను తొలగిస్తే వచ్చే నష్టం ఏమి లేదు స్వాగతిస్తాం! కానీ వేలాది మంది ఉపాధ్యాయ పట్టభద్రులు, గ్రాడ్యుయేట్ ల ఓట్లతో ఎమ్మెల్యే ఎన్నికకు దీటుగా రాజ్యాంగబద్ధంగా ఓటింగ్ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీలను తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన అన్నారు.
వైసిపి మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అన్న చందంగా మారిందని, సీఎం తొందరపాటు నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని తెలిసి కూడా ఏమీ మాట్లాడలేని నిస్సహాయత స్పష్టంగా కనబడుతుందని ఆయన అన్నారు. శాసన మండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అని ప్రతి ఏటా అరవై కోట్లు ప్రజాధనం దుబారాతో ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన వారిని సలహాదారులుగా తీసుకొని లక్షలాది రూపాయలు జీతాలుగా చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలిలో గతంలో ఎన్నడూ లేని విధంగా జంబోజెట్ 34 మంది సభ్యులతో పాటు ప్రతి రాష్ట్రంలో local advisory కమిటీల పేరుతో నియమించిన వారిని కూడా సీఎం తొలగించి శ్రీవారి నిధులు దుబారా కాకుండా పరిరక్షించాలని ఓ భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.