వినాశకర విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు కొల్లాపూర్ పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డి ఈశ్వర్, సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బీ శివ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లు తో కార్పొరేటర్లకు లాభాలు చేకూరతాయని అన్నారు.
పేదలకు భారంగా మారనున్న విద్యుత్ చట్టం
పేదలకు ఈ వినాశకర విద్యుత్ సవరణ చట్టం భారంగా మారుతుందని వారు అన్నారు. విద్యుత్తు రంగంలో రాష్ట్రాల హక్కులను ఈ బిల్లు హరిస్తుందని, విద్యుత్ విషయంలో కేంద్రం ఆధిపత్యాన్ని కొనసాగించడం సరికాదన్నారు. ప్రమాదకర విద్యుత్ సంస్కరణల బిల్లు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
సబ్సిడీలను ఎత్తేయడానికే బిజెపి ఎత్తుగడ
పేదలకు ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల బిల్లు లక్ష్యంగా పెట్టుకున్నదని వారు అన్నారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసి వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని పూర్తిస్థాయిలో మోసం చేయడం కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నదని వారు అన్నారు.
బిల్లును ఉపసంహరించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సలీం, ఈదన్న, ఎల్లయ్య, సంఘెం తదితరులు పాల్గొన్నారు.