కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంట రుణ బకాయిలను ఒక పర్యాయం రద్దు చేయాలని, రైతురుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించే విధంగా కృషి చేసి రైతులను, కౌలురైతులను ఆత్మహత్యల నుండి రక్షించాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వర రావు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు నష్టం కల్గించే నాలుగు లేబర్ కోడ్ లు రద్దుచేసి కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని కోరారు.
మహిళ రేజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపి బ్రిజ్ భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మణిపూర్, రాష్ట్ర, కేంద్ర బిజెపి ప్రభుత్వాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో వడ్డేశోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన రైతు సంఘాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను సమావేశం అమోదించింది. జూలై30న విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర సదస్సుకు అల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు హనన్ మొల్లా, ఎఐకెఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ . రాజా రామ్ సింగ్, కె కెయు జాతీయ కార్యదర్శి రామీంద్ర సింగ్ పాటియాల, ఎఐకెఎంఎస్ జాతీయ అధ్యక్షులు సత్యవాన్, కాంగ్రెసు కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు సుఖపాల్ సింగ్ ఖైరా, ఎన్ ఎపిఎం జాతీయ నాయకురాలు మేధాపట్కార్, జాతీయ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్, అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి పి.వి సుందరామరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక ఘాయాల్, ఎఐపికెఎస్ జాతీయ నాయకులు ఆర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారని, ఈ సదస్సును జయప్రదంచేయాలని సమావేశం తీర్మానించింది.
రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనడం ఎంతమాత్రం న్యాయసమ్మతం కాదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేసి ఆడివాసీ, దళితులు ఇతర బాధిత ప్రజల పునరావాస పనులు పూర్తి చేయాలని డిమాండ్ జేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు, వరదలు తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, మరల రైతులు విత్తు నాటుకోవడానికి అవసరమైన ఇన్ పుట్స్ ను వెంటనే అందించాలని, రైతుల పాలిట ఉరితాడు కాగల ఎలక్ట్రిసిటీ బిల్లును పార్లమెంటులో ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు బిగించరాదని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండానే కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయాలని తద్వారా రైతు భరోసా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందజేయాలని కోరారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో అసశువుల బాసిన 750 మంది రైతు కుటుంబాలకు, లక్కింపూరి ఖేరి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన ఐదు కుటుంబాల వారికి ఆర్థిక సహయం అందించడంతోపాటు కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ పంటలన్నిటికీ సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానకి సి2+ 50% కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. జాగృతి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ అటవీ చట్టంను విస్మరిస్తూ ఆదివాసీల హక్కులకు భంగం కల్గించరాదని కోరారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు కొలనుకొండ శివాజీ, కె.కోటయ్య, కోగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.