ఒమిక్రాన్ విజృంభణతో సందిగ్ధంలో పడిన టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ఎట్టకేలకు ఖరారైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో టీమిండియా క్రికెటర్లు సౌతాఫ్రికా విమానం ఎక్కేందుకు బీసీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో స్వదేశంలో వరల్డ్ టెస్ట్ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా వెళ్లనుంది టీమిండియా.
పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ముందుగా నిర్ణయించినట్లుగా డిసెంబరు 17 నుంచి కాకుండా.. డిసెంబరు 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా షెడ్యూల్లో ముందుగా ప్రకటించిన నాలుగు మ్యాచ్ల టీ 20 సిరీస్ ప్రస్తుతానికి వాయిదా పడింది. కొత్త ఏడాదిలో టీ20 సిరీస్ను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఎస్ఏ పేర్కొంది.