పంజాబ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీల నేతలను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందట బీజేపీ నాయకత్వం. ఇదే విషయంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ ఆరోపించారు.
బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, అంతే కాదు కేంద్ర కేబినెట్లో చోటు కూడా కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు తనతో బేరసారాలు నడిపిన బీజేపీ నేత పేరును కూడా బయటపెడతానని అన్నారు. తనకే కాదని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ గాలం వేస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు. తాను ఎవరికీ అమ్ముడుపోయే రకం కాదన్న ఆయన.. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.