మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ల మీద దాడి హేయమైన చర్య అని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాదిగ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న ,ప్రపంచ వ్యాప్తంగా మేధావిగా పేరు గాంచిన డా. బి ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని అరాచక శక్తులు విధ్వంసాలు సృష్టించడం దారుణమని అన్నారు.
ఈ దాడులు, విధ్వంసాలకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న శక్తులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పాత్రధారులను ,కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన వివిధ జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్సార్,అల్లూరి అన్నమయ్య ,పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెడితే లేని అభ్యంతరం అంబేద్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తుంది ? కుల ఉన్మాదంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం తగదని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును తొలగించాలని కుట్ర పడితే చూస్తూ ఊరుకోబోమని మందకృష్ణ మాదిగ ఆదేశాలనుసారం రాబోయే రోజుల్లో పలు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.