సీఎం జగన్… దళిత, సామాజిక వర్గానికి చెందిన వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అందుచేత రెండో సారి మంత్రి వర్గంలో వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని..ఈ విషయం రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు సామాజిక సమరభేరికి నిర్వహిస్తోంది.. అధికార పార్టీ. సిక్కోలు నుంచీ ప్రారంభమైన బస్సు యాత్ర అనంతరం వరకు వెళుతుంది. అందులో భాగంగా ఈ నెల 26 న విజయనగరం లోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
ఈ సామాజిక న్యాయభేరి పేరుతో జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు గురువారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధిత ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని పేర్కొన్నారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కె. నారాయణ స్వామి, అంజద్ భాషా, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోం మంత్రి తానేటి వనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్,, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు బస్సుయాత్రలో పాల్గొనున్నారని తదనంతరం జిల్లాలో జరిగే సామాజిక న్యాయభేరి సదస్సులో భాగస్వామ్యం కానున్నారని బుధవారం ఓ ప్రకటనలో వివరించారు. సంబంధిత ఏర్పాట్లు పూర్తయినట్లు పేర్కొన్నారు.